నార్కట్పల్లి, జూన్ 12: చెరువులోకి వెళ్లిన గొర్రెను కాపాడబోయి ఇద్దరు కాపరులు మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. నార్కట్పల్లికి చెందిన నారబోయిన నర్సింహ, ఆయన భార్య పద్మ, మెరుగు లింగయ్య ఆదివారం తమ గొర్రెలను కడిగేందుకు పెద్ద చెరువు వద్దకు తోలుకెళ్లారు.
ఓ గొర్రె పరుగెడుతూ చెరువు లోపలికి వెళ్లింది. దాన్ని పట్టుకొనేందుకు పద్మ (48) ముందుకు వెళ్లింది. ఆమె మునుగుతుండగా మెరుగు లింగయ్య (36) గమనించి కాపాడేందుకు వెళ్లాడు. పద్మ భయంతో లింగయ్యను గట్టిగా పట్టుకోవడంతో చేతులాడక ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.