Farmers | ఇల్లెందు రూరల్/నెక్కొండ, మార్చి 2: రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడం.. చివరకు అప్పులే మిగలడంతో భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మం డలం ధనియాలపాడు పంచాయతీ సేవ్యాతండాకు చెందిన ఆంగోత్ అమ్రు (52) తనకున్న రెండెకరాల్లో మిర్చి పంట వేశాడు. రూ.2 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. చీడపీడలు ఆశించడంతో పంట సరిగా పండలేదు. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. అప్పు ఎలా తీర్చాలన్న మనోవేదనతో కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో మందపురి భిక్షపతి (48) అనే రైతు, గీతకార్మికుడు శనివా రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేండ్ల కిందట అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. అప్పు తీర్చడానికి రెండెకరాల పదిగుంటల పొలంలో అర ఎకరం ఉంచుకొని మిగిలిన పొలాన్ని అమ్మేశాడు. రెండేండ్ల కిందట కూతురి పెండ్లి కోసం మళ్లీ అప్పు చేశాడు. గౌడ పరపతి సంఘంలో శనివారం చిట్టీ డబ్బులు కట్టాల్సి ఉన్నది. అందుకోసం పలువురిని అడిగినా డబ్బులు సర్దుబాటు కాలేదు. ఆర్థిక ఇబ్బందులతోపాటు అప్పులు తీరడం లేదని జీవితంపై విరక్తిచెంది శనివారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.