హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు వాటికోసం ఎకో బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. మంచిర్యాల నుంచి కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మిస్తున్న రహదారిపై అభయారణ్యంలో రెండు చోట్ల ఎకోబ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మించే కాంట్రాక్టర్తోనే ఎకోబ్రిడ్జి నిర్మాణానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రహదారులపై ఎకోబ్రిడ్జిలు నిర్మించడం ఇదే మొదటిసారి. ఒకచోట 200 మీటర్ల వెడల్పుతో, మరోచోట 150 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనలను నిర్మించనున్నారు. ఈ వంతెనలతో ఇటు వాహనదారులకు, అటు అడవి జంతువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్న జాతీయ రహదారులపై కూడా ఇలాంటి ఎకోబ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. జాతీయ రహదారుల సంస్థ ఈ దిశగా చర్యలు తీసుకొని అడవి జంతువులను, పర్యావరణాన్ని కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.