Rains Alert | తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. ఆ తర్వాత మూడురోజుల్లో రెండు నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ఈ నెల 7న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఈ నెల 8న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది. గడిచిన 24గంటల్లో వరంగల్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్క తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లుగా టీజీడీపీఎస్ పేర్కొంది.