కొత్తగూడ, అక్టోబర్ 11: బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు బావిలోపడి మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంచగూడెం గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య, స్వాతి దంపతుల కుమారుడు రితిక్(9), అనిత, శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్(10) దసరా పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చారు.
శనివారం అశోక్నగర్లోని వీరి బంధువు చనిపోవడంతో పిల్లలను ఇక్కడే ఉంచి పెద్దలంతా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో రితిక్, జతిన్ బహిర్భూమి కోసం సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. బావివద్ద చెప్పులు, దుస్తులు చూసిన స్థానికులు బావిలో పరిశీలించగా రితిక్ మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రాజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని బావిలో వెతకగా జతిన్ మృతదేహం లభించింది.