భువనగిరి అర్బన్, జూన్ 21: ఆర్మీని కాషాయ దళంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, ఇందులో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అగ్నిపథ్ రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా యువత ఆందోళనలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం అగ్నివీరుల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటన ఇవ్వడం దేశ విధ్వంసానికి కారణమవుతుందన్నారు. సైన్యంలో నాలుగేండ్ల సర్వీస్ను తీసుకురావడం వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉన్నదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సైన్యంలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ఈ పథకం ద్వారా ఆర్ఎస్ఎస్ క్యాడర్కు మిలటరీ శిక్షణ ఇప్పించి సర్వీస్ అనంతరం ఉపయోగించుకోవాలని చూస్తున్నదన్నారు.