యాదగిరిగుట్ట, మార్చి 4 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొనే భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులు మరింత దృష్టిసారించారు. దాతల సహకారంతో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఇప్పటికే దాహార్తిని తీర్చేందుకు దివీస్ లాబోరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 17 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తాజాగా ఎండ వేడిమిని తట్టుకునే విధంగా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. స్వామివారి దర్శనానికి శ్రీవారి మెట్ల నుంచి కొండపైకి వెళ్లే భక్తులు ఎండ వేడిమిని తట్టుకునే విధంగా అనువంశిక ధర్మకర్త భవనం నుంచి ప్రసాద విక్రయశాల భవనం వరకు ప్రత్యేకంగా టన్నెల్ ఫ్యాబ్రిక్ షెడ్ నిర్మించారు. తూర్పు రాజగోపురం ముందు భాగంలో భక్తులు వేచి ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్కు చెందిన దాతల సహకారంతో షెడ్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఇందుకోసం దాదాపు రూ.కోటి వెచ్చిస్తున్నారు. తొలిసారిగా నిర్మిస్తున్న ఫ్యాబ్రిక్ షెడ్ ఎండ వేడిమిని తట్టుకొని చల్లదనాన్ని అందించనున్నది. కొండపైన కోతులు విపరీతంగా సంచరిస్తున్న నేపథ్యంలో వాటిని తట్టుకునే విధంగా ఫ్యాబ్రిక్ షెడ్ను నిర్మిస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన షెడ్ను పరిశీలించి, గుట్ట పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించనున్నట్టు తెలిపారు.