హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుండగా.. అది కొత్త రూపును సంతరించుకుంటూ విస్తరిస్తున్నదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రంగులు మార్చుకుంటున్న ట్యూబర్కులోసిస్ (క్షయ వ్యాధి) బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారుతున్నదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. దేశంలో క్షయ నియంత్రణ, వ్యాధి తీవ్రత, రూపు మారుతున్న బ్యాక్టీరియాపై ఆయన ఓ సైన్స్ జర్నల్కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఊపిరితిత్తులను ధ్వంసం చేసేలా విస్తరించే క్షయ వ్యాధి ఇప్పుడు శరీరంలోని సున్నితమైన అవయవాలకు విస్తరించేలా బలపడిందని తెలిపారు. ప్రస్తుతం మహమ్మారులు విజృంభిస్తున్న తరుణంలో క్షయ వ్యాధి దానికి తోడైతే రోగికి ప్రాణాంతకవుతుందని అన్నారు.
ప్రస్తుతం ఏటా 15 లక్షల క్షయ వ్యాధి కేసులు నమోదవుతున్నాయని, కొందరిలో బ్యాక్టీరియాకు ఉండే కణత్వచం (సెల్వాల్) మరింత దృఢంగా మారుతున్నట్టు గుర్తించామని చెప్పారు. బ్యాక్టీరియా కణజాలం చుట్టూ పొర దృఢంగా మారుతున్నదని దీంతో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బ్యాక్టీరియా సమర్థంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. ఈ స్థితిలో బలహీనమైన రోగ నిరోధకశక్తి ఉన్న వారిని క్షయ కబళిస్తుందని హెచ్చరించారు. రూపుమారిన బ్యాక్టీరియా శరీరంలోని ఇతర అవయవాలకూ విస్తరిస్తు న్నదని, మెదడు, వెన్నెముకకు సోకి వృద్ధి చెం దుతున్నదని తెలిపారు. కంటికి సోకిన క్షయ ను గుర్తించడం కూడా కష్టంగా మారిందని, పునరుత్పత్తి అవయవాలకు వ్యాప్తి చెందుతున్న సందర్భాలూ ఉన్నాయని చెప్పారు.