హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. అక్టోబర్ 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 14న అంకురార్పణ జరగనున్నది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. బ్రహ్మోత్సవాల్లో కీలకంగా భావించే గరుడ సేవ ఈ నెల 19న జరగనున్నది. 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహించనున్నది.
ఉత్సవాలు జరిగే రోజుల్లో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 15 నుంచి 23 వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా 19న ఘాట్రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేసింది. అక్టోబరు 24న పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం అవుతుంది. కంపార్ట్మెంట్లలో భక్తుల రద్దీ అంతంతమాత్రంగానే ఉన్నది. శనివారం శ్రీవారిని 72,309 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం సోమవారం జరుగనున్నది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలపైనా చర్చించనున్నట్టు సమాచారం.