హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రతిఏటా శ్రీవారి డైరీలు, క్యాలెండర్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. ఇదేక్రమంలో 2023 క్యాలెండర్లు, డైరీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, తిరుమల, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో విక్రయిస్తున్నది. దీంతోపాటు టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆలయ ఈవో పేరుతో డీడీలు పంపి డైరీలు, క్యాలెండర్లు పొందే సౌకర్యం కల్పించారు. ఇప్పటికే అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు భక్తులకు విక్రయిస్తున్నాయి.
ధర ఎంతంటే..
ఒక్కో డైరీకి ఒక్కో ధర నిర్ణయించింది. పెద్ద డైరీ అయితే రూ.150, చిన్న డైరీ రూ.120, ఇక తిరుమల క్యాలెండర్ రూ.130, టేబుల్ క్యాలండర్ రూ.75గా నిర్ణయించారు. అయితే వీటి ధర కంటే సర్వీస్ చార్జ్ ఎక్కువగా ఉన్నది. ఒక్కో డైరీకి రూ.133, ఇక బల్క్లో 10 డైరీలు ఒకేసారి బుక్చేసుకుంటే రూ.379 సర్వీస్ చార్జ్ చేస్తున్నారు.