హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడిచి వెళ్లే భక్తుల లగేజీని మరింత సులభంగా తిరుమలలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో బుధవారం ఆయన లగేజీ యాంత్రికరణ ద్వారా రవాణా, డెలివరీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రెండు నడక మార్గాల్లో భక్తులు భద్రపరిచిన లగేజి సామర్థ్యాన్ని పెంచేందుకు యాంత్రీకరణను చేస్తూ త్వరితగతిన మరింత సులభంగా అందించాలని అన్నారు. డెలివరీ కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ అప్లికేషన్తో ప్రయోగాత్మకంగా పనిచేస్తున్న కేకేసీ, సుపథం కేంద్రాల వద్ద రోజువారీ లగేజీ డెలివరీల సంఖ్య, భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలన్నారు. సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో నరసింహ కిశోర్, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్ఏ అండ్ సీఏ బాలాజీ, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేషశైలేంద్ర, జీఎం (రవాణా) శేషారెడ్డి జీఎం (ఐటీ) సందీప్రెడ్డి, వీజే గిరిధర్ పాల్గొన్నారు.