హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి నాలుగు నెలల పాటు 5 వేల టికెట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం కరోనావ్యాప్తి తగ్గడంతో బుధవారం నుంచి రోజుకు 3 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తున్నది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 30 వరకు రోజూ మూడు వేల టికెట్లకు పెంచడంతో దాదాపు లక్షా పది వేల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం ఉద యం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల కావాల్సిన ఈ టికెట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. సాఫ్ట్వేర్ సమస్య తలెత్తడంతో దర్శన టికెట్లు అందుబాటులోకి రాలేదు. టీటీడీ అధికారులు సమస్యను పరిష్కరించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.