హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రూ.5,141 కోట్ల అంచనాతో 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సోమవారం తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆ నిర్ణయాలను వెల్లడించారు.
ధర్మప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహలో మంగళ సూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి నూతన వధూవరులకు అందజేయనున్నట్టు తెలిపారు. గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు రూ.30 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి టీడీడీ పాలకమండలి ఆమోదం తెలపడంతోపాటు నారాయణవనంలో వీరభధ్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.6.9 కోట్లు, స్విమ్స్ అభివృద్ధికి రూ.148 కోట్లు, సప్తగిరి అతిధి గృహాల అభివృద్ధికి రూ.2.5 కోట్లు, ఎస్ఎంసీ, ఎస్ఎస్సీ కాటేజీల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
టీటీడీ పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను సిల్డ్ లేబర్గా గుర్తించి వేతనాన్ని రూ.15 వేలు పెంచుతున్నట్టు ప్రకటించారు. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలల్లో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ.35 వేల నుంచి రూ.54 వేలకు, వేద పండితుల పెన్షన్ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ సదస్సుకు హజరవుతారని తెలిపారు.