హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరో 5 రూట్లలో టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపనున్నది. ఇప్పటికే ఎయిర్పోర్ట్కు 40కిపైగా ఎలక్ట్రిక్ బస్సులు నగరం నలువైపుల నుంచి తిరుగుతుండగా, మరో 5 రూట్ల నుంచి నాన్ ఏసీ బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు గురువారం ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈ బస్సుల్లో సాధారణ టికెట్ ధరలే ఉంటాయని, మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. సికింద్రాబాద్-పటాన్చెరు మధ్య మెట్రో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. రూట్ నంబరు 219లో 8 బస్సులు ఈ మార్గంలో శుక్రవారం నుంచి నడుస్తాయి. ప్రతి 24 నిమిషాలకు ఓ బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 6.10, పటాన్చెరు నుంచి ఉదయం 7.45కి మొదటి బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు.