హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో దూరం వెళ్లే ప్రయాణికులు ఎందరో మధ్యలో చిరుతిళ్లు కొనుక్కొని కడుపు నింపుకుంటుంటారు. మన్నికగా ఉండకున్నా, ధర ఎక్కువైనా ఆకలికి తట్టుకోలేక ఎలాగోలా ఆరగించేస్తుంటారు. ఇకనుంచి ప్రయాణికులకు ఆ సమస్య తీరనున్నది. ఆరోగ్యాన్ని పెంచే స్నాక్స్బాక్స్ను బస్సుల్లోనే టికెట్తో పాటు ప్రయాణికులకు ఇచ్చేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల్లో శనివారం నుంచి ఈ విధానాన్ని ప్రారంభించనున్నది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు విస్తరించనున్నది. ఇప్పటికే ఏసీ బస్సు సర్వీసుల్లో వాటర్ బాటిల్ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్బాక్స్ ఇచ్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ స్నాక్బాక్స్లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చికి ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెష్నర్, టిష్యూ పేపర్ ఉంటాయి. దీనికోసం టికెట్ ధరలోనే రూ.30 నామమాత్రపు ధరను ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రజలకు చేరువయ్యేందుకే స్నాక్బాక్స్ : బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్
ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకే టికెట్తో పాటు స్నాక్బాక్స్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, దీంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే చిరుధాన్యాలతో తయారుచేసిన కారా, చికి ప్యాకెట్లతో పాటు ప్రయాణికులకు అవసరమయ్యే మౌత్ ప్రెష్నర్, టిష్యూ పేపర్ను సంస్థ అందించనుందని చెప్పారు. ప్రతి స్నాక్బాక్స్లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్బ్యాక్ను పరిగణనలోకి తీసుకొని స్నాక్బాక్స్లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు.