హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): భద్రాద్రిలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ సంస్థ భక్తుల ఇండ్ల వద్దకే అందించనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించే బుకింగ్ పోర్టల్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పీ సంతోష్కుమార్కు రూ.116 చెల్లించి రశీదును పొంది ఇండ్ల వద్దకే తలంబ్రాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీ నిరుడు మాదిరిగానే ఈ సారి దేవాదాయశాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్లకు చేరవేసేయనున్నట్టు తెలిపారు. భక్తులు ఆర్టీసీ కార్గో పార్సిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి, వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. నిరుడు దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశామని, రూ.71 లక్షల రాబడి వచ్చిందని వివరించారు. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏండ్లకోసారి నిర్వహించే పుషర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని, తలంబ్రాలను పొందాలని పేర్కొన్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 91546 80020ను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఈడీలు పురుషోత్తం, వినోద్కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం విజయ్కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.