హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) /బంజారాహిల్స్: ఆర్టీసీ బస్సుల జోలికొస్తే ఊరుకునేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బిగ్బాస్ సీజన్-7 విజేతల ప్రకటన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదని స్పష్టం చేశారు. బస్సులు ప్రజల ఆస్తి అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాసుకొచ్చారు.
అసలేం జరిగిందంటే..
ఆదివారం రాత్రి బిగ్బాస్ సీజన్-7 గ్రాండ్ ఫైనల్ విజేత ప్రకటన నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు బిగ్బాస్ పోటీదారుల అభిమానులు వందలాదిగా చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజేతగా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించగానే అభిమానులు నినాదాలు ప్రారంభించారు. అక్కడే ఉన్న రన్నరప్ అమర్దీప్ అభిమానులూ పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమర్దీప్ బయటకు రాగా, ఆయన కారు అద్దాలను ప్రశాంత్ అభిమానులు పగలగొట్టి దాడికి యత్నించారు.
పోలీసులు చెదరగొట్టి అమర్దీప్ను పంపించేశారు. గతంలో బిగ్బాస్లో పాల్గొన్న గీతూరాయల్ స్టూడియోలో నుంచి బయటకు రాగా ఆమె కారు అద్దాలనూ ధ్వంసం చేశారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు మరోసారి లాఠీలకు పనిచెప్పారు. స్టూడియో బయట పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు పల్లవి ప్రశాంత్ను రెండో గేటు నుంచి బయటకు పంపగా, కారులో వెళ్లిపోయిన ప్రశాంత్ కాసేపటికి ఓపెన్ టాప్ జీపులో స్టూడియోస్ వద్దకు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.
కేసులు నమోదు చేసిన పోలీసులు
ఆర్టీసీ డ్రైవర్ ఎండీ ఖాసీం ఫిర్యాదుతో గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ 147, 148, 427 రెడ్విత్ 149తోపాటు 3 పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. పల్లవి ప్రశాంత్, అతడి డ్రైవర్ సహా పలువురిపై ఐపీసీ 147, 148, 290, 353, 427 రెడ్విత్ 149 సెక్షన్లతోపాటు 3 పీడీపీపీ యాక్ట్ కింద పోలీసులు మరో కేసు నమోదు చేశారు.