TSRTC | గుజరాత్లోని బరోడాలో ఇటీవల జరిగిన ద్వితీయ అంతర్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థ ఉద్యోగులు రెండు పతకాలను సాధించారు. బాడ్మింటన్ ఉమెన్స్ డబుల్ కేటగిరిలో రన్నరప్స్గా టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జోడీ ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి నిలిచారు. వారు సిల్వర్ మెడల్ సాధించారు. బాడ్మింటన్ ఉమెన్స్ టీం చాంపియన్ కేటగిరిలో టీఎస్ఆర్టీసీ రన్నరప్స్గా నిలిచింది. ఈ క్యాటగిరీలో ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవిత సిల్వర్ మెడల్ గెలుపొందారు.
ద్వితీయ అంతర్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటడం పట్ల టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలను బస్ భవన్లోని తన ఛాంబర్లో శనివారం ఆయన అభినందించారు. నిరంతర కృషి, ప్రాక్టీస్ తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. క్రీడల్లో ఆసక్తి గల ఉద్యోగులను సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈడీ కృష్ణకాంత్, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట నారాయణ, కోచ్ ఏవీవీ రామరాజు, మేనేజర్ ఎండీ అన్సర్ అలీ, ఫిజియో హిమన్షు కుమార్, తదితరులు పాల్గొన్నారు.