హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): వచ్చే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కొత్త బస్సులో కొద్దిదూరం ప్రయాణించి అందులోని సదుపాయాలను పరిశీలించారు. అంతకు ముందు మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు బస్ సర్వీస్లకు దీటు గా అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పర్యావరణ అనుకూల ప్రజారవాణా కోసం ఆర్టీసీ ఈ-గరుడ బస్సులను అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు. ఈ ఏడాదిలోగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్టు తెలిపారు.
20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఆర్టీసీ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే తొలుత ఈ-గరుడ బస్సులను విజయవాడకు నడుపుతున్నట్టు చెప్పారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ చార్జింగ్ కోసం హైదరాబాద్-విజయవాడ మధ్య సూర్యాపేటలో 20 నిమిషాలు ఆగుతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో త్వరలో 10 డబుల్ డెక్కర్, 550 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్యెల్యే అరికెపూడి గాంధీ, ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ ప్రదీప్, ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవీందర్, జేడీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఈడీలు పురుషోత్తం, మునిశేఖర్, సంస్థ అధికారులు కృష్ణకాంత్, రఘునాథరావు, విజయకుమార్, ఆర్ఎంలు శ్రీధర్, వరప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.