హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే నగదు కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకురానున్నది.
ఇప్పటికే ఈ అంశంపై ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గత ఏడాది చివరలోనే నగదు రహిత టికెట్ కొనుగోలు పద్ధతిని ప్రవేశపెట్టాలని టీఎస్ఆర్టీసీ భావించింది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల అది అమలు కాలేదు. ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే అవి ఎవరి ఖాతాలో జమ చేయబడతాయి? ఏదైనా కారణం వల్ల డబ్బులు జమకాకపోతే ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? వంటి ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఈ సమస్యలు అన్నింటికీ పరిష్కారంగా కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అలా రూపొందించిన సాఫ్ట్వేర్ను ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఈ విధానం విజయవంతమైతే.. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ నగదు రహిత టికెట్ను అందుబాటులోకి తేనున్నది.