సుల్తాన్బజార్, జనవరి 11: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఊళ్లకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికులు రానుపోను టికెట్లు ముందుగానే బుక్ చేసుకొంటే రిటర్న్ జర్నీ టికెట్పై 10 శాతం రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందని హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
పండుగ నేపథ్యంలో ఈ నెల 14 వరకు 4,233 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. జూబ్లీ బస్స్టేషన్ నుండి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వైపు 1,184 బస్సులు, ఎల్బీ నగర్ నుండి ఖమ్మం, నల్లగొండ, విజయవాడ, ఏపీలోని ఇతర ప్రాంతాలకు 1,133 బస్సులు, ఉప్పల్ నుండి వరంగల్, తొర్రూర్ వైపు 683 బస్సులు, ఆరంగఢ్ నుండి మహబూబ్నగర్, కర్నూలు వైపు 814 బస్సులు, ఎంజీబీఎస్ నుండి సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ, ఏపీలోని ఇతర ప్రాంతాలకు 419 బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు.