హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా 40 లక్షల నుంచి కోటికిపైగా పెరిగింది. ఈ మేరకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో సంస్థ శనివా రం ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్లో ని బస్భవన్లో ప్రమాద బీమా పెంపుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాసర్రావు ఒప్పందం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి బీమా వర్తించనున్నది. యూబీఐ సూపర్ శాల రీ సేవింగ్ అకౌంట్ (యూఎస్ఎస్ఏ) కింద కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డుతో మరో 12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా 1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను బాధిత కుటుంబాలకు సంస్థ అందించనున్నది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బీమా అమల్లోకి రానున్నది.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు 40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఇకపై వాటితో సంబంధం లేకుండా ప్రతి ఒక సిబ్బందికి కోటి బీమా వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, ఈడీలు కృష్ణకాంత్, పీవీ మునిశేఖర్, వినోద్కుమార్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వయిజర్ విజయ పుష్ప, సీపీఎం ఉషాదేవి, యూబీఐ జనరల్ మేనేజర్ కృష్ణన్, డిప్యూటీ జోనల్ హెడ్లు రవికుమార్, అర్వింద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.