హైదరాబాద్ : ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ(TS RTC |) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ(ఓఎస్ఆర్టీసీ)తో టీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్,ఎమ్మెల్యే బాజిరెడ్డిగోవర్దన్ సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేశ్కుమార్ పట్నాయక్ ఒప్పంద (Agreement)పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం అందజేసుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్ ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్ఆర్టీసీ 13 సర్వీస్లను తెలంగాణకు నడపనుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా రాయఘడ్ వరకు రెండు బస్సులు, భవానిపట్నం- విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్ బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. నవరంగ్పూర్ – జైపూర్ , భవానిపట్నం-విజయవాడ(వయా భద్రాచలం)2, రాయఘడ్-కరీంనగర్2, జైపూర్ బస్సులను ఓఎస్ ఆర్టీసీ తిప్పనుంది.
తెలంగాణ-ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాకపోకల డిమాండ్ నేపథ్యంలో ఓఎస్ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని వివరించారు. ఆయా మార్గాల్లో 10 బస్సులతో ఒడిశాలో 3378 కిలోమీటర్ల మేర నడపాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఎండీ సజ్జనర్ వివరించారు.
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు అద్భుతం..
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేశ్కుమార్ పట్నాయక్ ప్రశంసించారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 13 బస్సుసర్వీస్లతో తెలంగాణలో 2896 కిలోమీటర్ల మేర నడుపుతున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్కుమార్, సీపీఎం కృష్ణకాంత్ సీటీఎం జీవనప్రసాద్ సీఎంఈ రఘునాథరావు, ఐటీ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్, సీటీఎం(ఎంఅండ్సీ) విజయ్ బిజినెస్హెడ్ సంతోష్ చీఫ్మేనేజర్ విజయ పుష్ఫతో పాటు ఓఎస్ ఓఎస్డీ దీప్తి మహాపాత్రో, ట్రాన్స్ ప్లానర్ సందీప్కుమార్ పాల్గొన్నారు.