హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఏర్పాటైన తరువాత తొలిసారి శనివారం సంస్థ పాలకమండలి సమావేశం కానున్నది. గత ఏడేండ్లుగా సంస్థ తీసుకొన్న నిర్ణయాలు, బదిలీలు అన్ని తాత్కాలిక పద్ధతుల్లో జరిగినట్టు రికార్డు అవుతున్నాయి. ఇప్పుడు వాటిని బోర్డు (ర్యాటిఫై) ఆమోదించనున్నది. కొత్త బస్సుల కొనుగోలు, ప్రైవేటు బస్సులను నియంత్రించి ఆదాయం సమకూర్చుకోవడం, ఇటీవల అమల్లోకి తెచ్చిన సెస్లు, కార్గో అండ్ పార్సిల్ సర్వీసు, సొంత స్థలాల్లో ప్రారంభించిన పెట్రోల్ బంక్లు, నర్సింగ్ కళాశాల ఇలా వివిధ అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నది. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బోర్డ్ చైర్మన్గా, ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కమిషనర్, రోడ్లు భవనాలశాఖ ఈఎన్సీ, కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ రవాణా విభాగం డైర్టెకర్ సభ్యులుగా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
అందరికీ అందుబాటులో ఆర్టీసీ దవాఖాన
మే 1వ తేదీ నుంచి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఈవినింగ్ క్లినిక్ ప్రారంభించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇక్కడ ప్రైవేటు దవాఖానలతో పోలిస్తే నామమాత్రపు ఫీజులు ఉంటాయని దవాఖాన వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ సిబ్బంది మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.