హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు యాజమాన్యం తీపికబురు చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. జూలై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9% డీఏను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని పేర్కొన్నారు. 2011లో దాదాపు 29 రోజులపాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్లో ఉన్న డీఏను మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసిందని తెలిపారు. మిగిలిన ఒక డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని పేర్కొన్నారు.