TSRTC | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం పుణ్య క్షేత్రానికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. వీకెండ్స్లో 2రోజులు ఈ టూర్ ఉంటుంది. ప్యాకేజీలో పెద్దలకు టికెట్ ధర రూ.2,700, పిల్లలకు రూ.1,570 గా నిర్ణయించారు. ఈ నెల 22న ఈ ప్రత్యేక బస్సులను ప్రారంభించనున్నారు. ప్రతి శనివారం హైదరాబాద్లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు ఈ బస్సులు బయలు దేరుతాయి. 8 గంటలకు ఎంజీబీఎస్లో అందుబాటులో ఉండనున్నాయి.
మధ్యా హ్నం 1.30 గంటలకు శ్రీశైలం చేరుకుంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు పాతాళగంగ సందర్శన, అక్కడ బోటింగ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మల్లికార్జునస్వామి, శ్రీభ్రమరాంబిక అమ్మవారి దర్శనం కల్పిస్తారు. రాత్రి హోటల్లో బస కల్పిస్తారు. మరుసటి రోజు ఉదయం శ్రీశైలం డ్యాం, పంచధార, శిఖరం, సాక్షి గణపతి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రి 8 గంటలకు బస్సు హైదరాబాద్కు తిరిగి చేరుకుంటుంది. ఆలయ దర్శనం, హోటల్ వసతి ఈ ప్యాకేజీలో కల్పిస్తారు.