హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రూట్ల క్రమబద్ధీకరణ, లాభాల పెంపునకు సంబంధించిన డాటా విశ్లేషణకు టీఎస్ఆర్టీసీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాటా సైన్స్(ఐఐడీఎస్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. మంగళవారం హైదరాబాద్లోని ఐఎస్బీ క్యాంపస్లో ఐఎస్బీ డాటా సైన్స్ విభాగం ఈడీ మనీషన్ గంగ్వార్, టీఎస్ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం త్వరలోనే ఇతర ప్రజా రవాణా సంస్థలకు రోల్ మాడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ 10 వేల బస్సులతో ప్రజలను క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నదని తెలిపారు. ప్రతిరోజూ సగటున 35 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వివరించారు. పర్యావరణ సవాళ్లను ఎదురోవడంతోపాటు ప్రజల సురక్షిత ప్రయాణానికి ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ, టీఎస్ ఆర్టీసీని పటిష్ఠపరచడానికి డాటా విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వీ రవీందర్, ఈడీ(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎస్వో విప్లవ్, కన్సల్టెంట్లు ముకుంద్, దీప, ఐఎస్బీ నుంచి మధు విశ్వనాథన్, సుధీర్ ఓలేటి, కుమార గురు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.