Group-2 | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించబోయే ఈ పరీక్ష నిర్వహణపై నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సోమవారం కమిషన్ సమావేశమైంది. పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై చర్చించింది. గ్రూప్-2 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 29, 30న నిర్వహించాల్సి ఉన్నది. అభ్యర్థుల కోరిక మేర కు పరీక్షను కమిషన్ వాయిదా వేసి, నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తామని తెలిపింది.
ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ, వసతులు, నిబంధనలు తదితర అంశాలపై 33 జిల్లా కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పలు సూచనలు చేశా రు. ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని, అందులో మార్పులు, చేర్పులుంటే తమకు తెలియజేయాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని, అక్కడే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తెరిచి పంపిణీ చేయాలని, ఓఎంఆర్ షీట్లు లెక్కించడం, ప్యాక్ చేయడం, సీల్ వేయడం వంటివన్నీ జరగాలని వివరించారు. పరీక్ష కేంద్రాలను ఈ నెల 7లోగా ఫైనల్ చేసి, టీఎస్పీఎస్సీకి నివేదించాలని ఆదేశించారు.