హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) లో తమ విద్యార్హతలను నమోదు చేసుకుంటున్న తెలిసిందే. త్వరలోనే 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం కేసీఆర్ ఇటీవలే శాసనసభ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ ఓటీఆర్ ప్రక్రియ ఊపందుకుంది. కొత్తగా 37,983 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను నమోదు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు ఓటీఆర్ను టీఎస్పీఎస్సీ తప్పనిసరి చేసింది. 2015లో ఓటీఆర్ను ప్రారంభించగా, మొత్తం 25,38,590 మంది అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. స్థానికత విషయంలో అభ్యర్థులు తమ ఓటీఆర్ను ఎడిట్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 1,02,651 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకున్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివారు అనే విషయాలను అభ్యర్థులు ఓటీఆర్లో ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. ఓటీఆర్ నమోదు, ఎడిట్ చేసుకోవాలనుకునే వారు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించొచ్చు.