హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ను సోమవారం ఈడీ తన కార్యాలయంలో సుమారు పదిన్నర గంటలపాటు విచారించింది. రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది. మొదట వీరిద్దరిని విడివిడిగా.. అనంతరం కలిపి ప్రశ్నించినట్టు తెలిసింది. మధ్యాహ్నం నుంచి ఈడీ జేడీ రోహిత్ ఆనంద్ ఆధ్వర్యంలో పలు అం శాలపై ప్రశ్నించినట్టు సమాచారం. ఆయన రాత్రి పదిగంటలకు బయటికి వెళ్లగా, మరో గంటపాటు ఇంకొందరు అధికారులు వీరిద్దరినీ ప్రశ్నించారు.
అనంతరం వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కేసులో సుమారు రూ.38 లక్షలకుపైగా నగదు చేతులు మారిందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నట్టు తెలిసింది. ఇదే కేసులో కస్టోడియన్ శంకరలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిని ఈడీ అధికారులు విడతలవారీగా ప్రశ్నించారు. ఈ పేపరు లీకేజీ కేసులో సుమారు 450 మందినిపైగా విచారించిన సిట్ బృందం ఇప్పటివరకూ 19 మందిని అరెస్టు చేసింది. మొత్తం రూ.31 లక్షలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్టు సిట్ గుర్తించింది.