హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరికొంత మందిపై వేటు పడింది. ఈ కేసులో నిందితులైన మరో 13 మంది నిందితులను శాశ్వతంగా డిబార్ చేసింది. వీరు భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకూ హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు వారి జాబితాను టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ బుధవారం విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయమున్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డిబార్ చేసింది. దీంతో మొత్తం సంఖ్య 50కి చేరింది.
పేపర్ లీకేజీ కేసులో సిట్ కస్టడీకి అన్నాచెల్లెలు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాచెల్లెలు రాయపురం విక్రం, రాయపురం దివ్య సహా పూల రవికిశోర్, ధనవత్ భరత్నాయక్, పశికంటి రోహిత్కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్కుమార్ను ఐదు రోజుల సిట్ కస్టడీకి అప్పగిస్తూ జువైనెల్ కోర్టు మెజిస్ట్రేట్ జీ రాధిక బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించాలని సిట్ పీపీ కృష్ణయ్య కోరగా, ఐదు రోజులకు మాత్రమే కోర్టు అంగీకరించింది.