హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 4.03లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జూన్ 4 వరకు కోడ్ అమలులో ఉన్నందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమయ్యే వారిలో చాలామంది నిరుద్యోగులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొంతమంది ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఎలాంటి ప్రిపేర్ అయ్యే అవకాశం లేకపోవడంతో తమలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇవ్వడం కోసం గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్షలను జూన్ 9న నిర్వహించాలన్న ఉద్దేశంతోనే అధికారులు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.