హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే ప్రిలిమినరీ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజుల్లో ఫైనల్ కీని వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత వెంటనే మెరిట్ లిస్టును ప్రకటించాలని భావిస్తున్నది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్ -4 క్యాటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేశారు.
జూలై 1న పరీక్ష నిర్వహించగా, పేపర్ -1కు 7,63,835 మంది, పేపర్ -2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అత్యధిక ఉద్యోగాలు ఉండటం, ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాయడంతో గ్రూప్-4పై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. రోజుకు సగటున 25 నుంచి 30 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేసింది. ఆ తర్వాత ఒకటికి రెండుసార్లు పునః పరిశీలించి ఆగస్టు 28న ప్రిలిమినరీ కీని విడుదల చేసింది.
ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను వెబ్సైట్లో పొందుపరిచింది. అదేనెల 30 నుంచి సెప్టెంబర్ 4వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. వారంలో టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి, సభ్యుల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలోపే గ్రూప్-4 ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.