ఖైరతాబాద్, జూన్ 23: ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడమే కేంద్రం పనిగా పెట్టుకొన్నదని ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఎనిమిదేండ్లలో 26 జాతీయ సంస్థలను ప్రైవేట్పరం చేసిందని, అగ్నిపథ్తో ఆర్మీని సైతం ప్రైవేటీకరించే పని ప్రారంభించిందని ధ్వజమెత్తారు. అగ్నిపథ్ విధానానికి వ్యతిరేకంగా ఓయూ, టీఎస్జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం జేఏసీ చైర్మన్ మాందాల భాసర్, అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అగ్నిపథ్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వ్యతిరేక పథకమని, రిజర్వేషన్లు లేకుండా నాలుగేండ్లు కాం ట్రాక్ట్ పద్ధతిలో నియమించి యువకుల జీవితాలను నాశనం చేసే పనిలో పడ్డారని ఆగ్రహించారు. ఈ విధానం వల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగేండ్ల కాం ట్రాక్టు ముగిసిన తర్వాత కేవలం 25 శాతం మందిని శాశ్వత పద్ధతి ద్వారా నియామకం, మిగతా 75 శాతం మందిని తొలగించడమనేది కేవలం కేంద్ర ప్రభుత్వం రక్షణ పేరుతో డబ్బులను మిగుల్చుకొనే ప్రయత్నమేనని పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత వారి భవిష్యత్పై కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్మీ ఉద్యోగార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంలో మర్మమేమిటో చెప్పాలని నిలదీశారు. దేశంలోని ప్రభుత్వ సంస్థల ఆస్తులను అమ్ముతూ కేంద్రం పబ్బం గడుపుతున్నదని, ఎనిమిదేండ్లలో 26 సంస్థల ఆస్తుల అమ్మకాలే తప్ప అభివృద్ధి ఎకడా లేదని ఎద్దేవాచేశారు. ఆ డబ్బు సరిపోవడం లేదు అన్నట్టుగా, ఇప్పుడు దేశం కోసం జీవితాలను అంకితం చేసే సైనికులను కూడా అగ్నిపథ్ ద్వారా అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. త్వరలోనే దేశ ప్రజలు ఈ నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
ఆర్మీ అభ్యర్థుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని టీఆర్ఎస్ నేత, బీసీ జన సమితి నేత రాజారాం యాదవ్ మండిపడ్డారు. తాను డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్సీసీలో సీ క్యాడెట్గా పనిచేశానని, భవిష్యత్లో ఎప్పుడు యుద్ధం వచ్చినా దేశం కోసం పోరాడే అవకాశం తనకు ఉంటుందని చెప్పారు. కానీ బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్రెడ్డిలకు ఆ అర్హత ఉందో లేదో తెలియదన్నారు. కాంగ్రెస్ నేషనల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. దేశ సమగ్రత, భద్రతకు ముప్పుగా పరిణమించిన అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చి కమిటీ కన్వీనర్ ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. అగ్నిపథ్.. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఆరెస్సెస్ తీసుకొచ్చిన పథకంగా అభివర్ణించారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. సమావేశంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్, ప్రధాన కార్యదర్శి మహేశ్, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, డాక్టర్ రవినాయక్, నరేశ్జాదవ్, ఓయూ జేఏసీ ప్రధాన కార్యదర్శి రవీందర్నాయక్, టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా, ఎస్ఎఫ్ఎస్జే అధ్యక్షుడు అశోక్యాదవ్, టీవీఎస్ అధ్యక్షుడు పుదరి హరీశ్గౌడ్, బీసీ నేత చిరంజీవి బెస్త తదితరులు పాల్గొన్నారు.