Vangapally Srinivas | ముషీరాబాద్, డిసెంబర్ 14: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ 21న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన చలో ఢిల్లీ వాల్ పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీల పేరిట ప్రధాని మోదీ కాలయాపన చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్టు చెప్పారు.
వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి పదేండ్లుగా కాలయాపన చేస్తున్న బీజేపీ తీరు ఆక్షేపనీయమని, మాదిగలను మోసం చేయడానికే మరోమారు కమిషన్ ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణ ద్వారానే మాదిగలు, ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ మీసాల మల్లేశ్, హుస్సేన్, యాదగిరి, వరలక్ష్మీ, లక్ష్మీ, నందకిశోర్, మహేశ్, శాంతికిరణ్, కొల్లూరి వెంకట్, చందు తదితరులు పాల్గొన్నారు.