TSLPRB Results | ఎస్ఐ, ఏఎస్ పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేసింది. 587 పోస్టులకు ఎన్నికైన వారి జాబితాను నియామక బోర్డు ప్రకటించింది. 443 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపింది.
మొత్తం 587 ఎస్సై, ఏఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. కాగా విద్యార్హతలు, రిజర్వేషన్, స్థానికత, వయసు సడలింపు, హారిజెంటల్ రిజర్వేషన్, ఇతర బెనిఫిసరీలను పరిగణలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేశామని బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల గుణగణాలు, ప్రవర్తన, క్రిమినల్ కేసులపై టీఎస్ఎల్పీఆర్బీ ఆరా తీయనున్నట్లు వెల్లడించారు.
టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో కటాఫ్ మార్కుల కేటాయింపు, అభ్యర్థుల డేటాఫ్ బర్త్ తదితర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి అసెస్టెడ్ ఫామ్ పూర్తి చేయాలని తెలిపారు. అభ్యంతరాలున్న అభ్యర్థులు నేటి నుంచి 9వ తేదీ వరకూ నిర్ణీత రుసుము చెల్లించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. కాగా గరిష్టంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు.. ఇలా అన్ని విభాగాలకు పంపే అవకాశం కనిపిస్తున్నది.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..