హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూములు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయని 225 సంస్థలకు టీఎస్ఐఐసీ షాక్ ఇచ్చింది. ఆయా కంపెనీలకు భూకేటాయింపులను ఇటీవల రద్దుచేసి, 1,964 ఎకరాల భూములను వెనక్కు తీసుకొన్నది. వీటిని ఆన్లైన్ ద్వారా ఇతర సంస్థలకు కేటాయిస్తున్నది. నిబంధనల ప్రకారం.. భూములు పొందిన కంపెనీలు 6 నెలల్లోగా అన్నిరకాల అనుమతులు పొంది రెండేండ్లలోగా ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లబ్ధిదారులకు భూయాజమాన్య హక్కులు కల్పిస్తారు. ఇందులో ఎటువంటి జాప్యం జరిగినా నోటీసులు జారీచేసి భూకేటాయింపు రద్దుచేస్తారు. గత ఏడేండ్లలో టీఎస్ఐఐసీ 2,290 కంపెనీలకు 4,163 ఎకరాల భూములను కేటాయించింది. వీటిలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన 253 కంపెనీలకు 95 ఎకరాలు కేటాయించారు. తద్వారా మొత్తంగా రూ.56,597 కోట్ల పెట్టుబడులు, 1.50 లక్షల ఉద్యోగాలు లభించాయి.
తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం 1.50 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతించింది. దీంతో టీఎస్ఐఐసీ దశలవారీగా భూసేకరణ జరుపుతూ పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తున్నది. 2014 నుంచి 2021 వరకు 19,961 ఎకరాలు సేకరించి వాటిలో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాల సేకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి ఏపీఐఐసీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 23,653 ఎకరాల భూమిని మాత్రమే అభివృద్ధిచేయడం గమనార్హం.
తెలంగాణ ఏర్పాటు అనంతరం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రంగాలవారీగా పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేశారు. రావిర్యాల, మహేశ్వరంలలో ఎలక్రానిక్స్ హార్డ్వేర్ క్లస్టర్, సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్కు, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్కు, భద్రాచలంలో సీడ్ పార్క్, శివనగర్లో ఎల్ఈడీ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఆటోమొబైల్ ఈవీ క్లస్టర్, టెక్స్టైల్ పార్కు సహా మొత్తం 28 కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేశారు. మరో 80 పార్కుల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవికాకుండా ఇంద్రకరన్లో టెక్స్టైల్ మిల్లులకు 163.90 ఎకరాలు, వంటనూనెల కంపెనీలకు 214.40 ఎకరాలు, రాకంచర్లలో స్టీల్ అండ్ రోలింగ్ పరిశ్రమలకు 112.48 ఎకరాలు, ఫార్మాసిటీకి 19,333 ఎకరాలను ప్రత్యేకంగా అభివృద్ధిచేశారు. వీటిని ఇంకా కేటాయించాల్సి ఉంది.