TSEAMCET | రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ విద్యాసంవత్సరంలో 16,296 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు .. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో 4,959 సివిల్, మెకానికల్లో 5,156, ఇతర కోర్సుల్లో మరో 458 సీట్లు మిగిలాయి. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 178 కాలేజీల్లో మొత్తం 85,671 బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 69,375 సీట్లు (80.97శాతం) భర్తీ అయ్యాయి. ఇంకా 16, 296 సీట్లు మిగిలిపోయాయని అధికారులు వెల్లడించారు.
యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే.. 14,511 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిపోయాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289, యూనివర్సిటీ కాలేజీల్లో మరో 1,496 సీట్లు మిగిలిపోయాయి. బీటెక్ సీట్ల కౌన్సెలింగ్ ముగియగా.. ఈ విద్యా సంవత్సరం సీట్లన్నీ ఇక ఖాళీగా ఉండనున్నాయి. అయితే, అడపదడపా సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే విద్యార్థులను చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో స్పీట్లు పొందిన వారు ఈ నెల 29లోగా ఫీజు చెల్లించి.. ఆయా తేదీల్లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు టీసీతో పాటు సర్టిఫికెట్లను సైతం కాలేజీలో సమర్పించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.