TS EAMCET | రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఈ పరీక్షలను జేఎన్టీయూ ఆన్లైన్ వేదికగా నిర్వహించనున్నది. ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ బీ.డీన్ కుమార్ వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం ఎంసెట్లో ఒక్కో సెషన్కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను 40వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్ అయాన్ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంసెట్ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.