హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో (Junior Colleges) మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు (Inter Board) మరోసారి పొడిగించింది. షెడ్యూల్ (Admission Schedule) ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వారికోసం గడువును ఈ నెల 31 (August 31st) వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు (TSBIE) వెల్లడించింది. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు ఆలస్య రుసుం కింద రూ.750 చెల్లించాలని, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కాలేజీల్లో చేరేవారు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
కాగా, జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమయ్యాయి. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, మార్చి మొదటి వారం నుంచి థియరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.