TS Weather Update | రాష్ట్రంలో మరో రెండురోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పింది. అలాగే సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు సైతం పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.