TS Weather | వాయువ్య బంగాళాఖాతంలో మరో 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం మీదున్న ఆవర్తనం.. గురువారం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతుందని తెలిపింది.
ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో ప్రభావంతో రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ సీజన్లో ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు, జూలై నెల చివరిలో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఆగస్టులో చినుకు జాడ లేకుండా పోయింది. ఆరుతడి పంటలు వేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.