TS Weather | తెలంగాణలో గడిచిన మూడురోజులుగా వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు అన్నదాతలకు భారీగా నష్టం కలుగుతున్నది. మామిడి, జామ, మక్క, జొన్న తదితర పంటలకు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. అయితే, రాగల మరో రెండురోజులు రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు పలు జిల్లాల్లకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు కిలోకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.