TS Weather | తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు పడుతాయని చెప్పింది. బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మంగళవారం పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపోడులో 73.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.