TS Weather | తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎండలకు తోడు వడగాలులు వీస్తుండడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. బుధవారం జగిత్యాల జిల్లా జైనాలో 46.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
అల్లీపూర్ (జగిత్యాల) 46.1, కొత్తగట్టు (కరీంనగర్) 46, కోల్వాయి (జగిత్యాల) 46, వీణవంక 46, దూల్మిట్ట (సిద్దిపేట) 45.9, వెల్గటూరు (జగిత్యాల) 45.9, తెల్దేవరపల్లె 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ వివరించింది. ఇదిలా ఉండగా.. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 2న కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో దీర్ఘకాల వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను ప్రకటించింది.
3న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక వడగాలులు వీస్తాయని పేర్కొంది. 4న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.