TS Weather | నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాపాతం నమోదైంది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జిల్లాల్లో ఉరుము, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదవగా.. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయని టీఎస్ డీపీఎస్ వివరించింది.