TS Weather | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వాన కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్లో అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.