TS Weather | తెలంగాణలో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని వివరించింది. మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని టీఎస్ డీపీఎస్ వివరించింది.