హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా అవకాశం కల్పించినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. శుక్రవారం టెట్ సమాచార బులెటిన్, సిలబస్ విడుదల చేశారు. జూన్ 12న టెట్ నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 2017 సిలబస్ ప్రకారమే టెట్ నిర్వహించనున్నట్టు స్పష్టంచేశారు. పేపర్-1, పేపర్-2 కు దరఖాస్తు రుసుము రూ.300గా నిర్ణయించినట్టు పేరొన్నారు. రెండు పేపర్లు రాసేవారికి కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. శనివారం నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే రెండు వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉన్నది. హాల్టికెట్లను జూన్ 6 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల సందేహాలు, సూచనలకు మార్చి 26 నుంచి జూన్ 12 వరకు హెల్ప్డెస్ సేవలు అందుబాటులో ఉంటాయి. వివరాలకు 040-23120340, 23120433, 8121010310, 8121010410 నంబర్లలో, tstet.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
