హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ వెబ్సైట్లో పెట్టారు. పేపర్-1 టాపర్గా 150 మార్కులకుగాను 133 మార్కులతో జంధ్యాల అంజని నిలిచారు. పేపర్-2 టాపర్గా 131 మార్కులతో కొటారు వెంకటరమణ నిలిచారు. జంధ్యాల అంజని పేపర్ -2లో 129 మార్కులతో టాప్ 5 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. జూన్ 12న నిర్వహించిన టెట్కు 5.50 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1లో 32.68 శాతం, పేపర్-2కు 49.64 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. పేపర్-1లో 3,999 విద్యార్థులు, పేపర్-2లో 6,571 విద్యార్థులు వందకుపైగా మార్కులు సాధించారు.
ఆశాజనకంగా ఫలితాలు
ప్రతిసారి టెట్ ఫలితాల్లో ఏదో ఒక పేపర్లో అత్యధికులు అర్హత సాధించడం, మరో పేపర్లో సాధించకపోవడం జరుగుతున్నది. 2016 మేలో, 2017 జూలై నెలల్లో టెట్ నిర్వహించారు. 2016లో పరీక్షలో పేపర్-1లో 54.45 శాతం, పేపర్-2లో 25.04 శాతం మాత్రమే అర్హత సాధించారు. 2017లో నిర్వహించిన పేపర్-1లో 57.37 శాతం, పేపర్-2లో 19.51 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది రెండు పేపర్లల్లో క్వాలిఫై అయిన వారి శాతం కాస్త ఆశాజనకంగానే ఉన్నది. టెట్ సర్టిఫికెట్ అర్హతను జీవితకాలం పొడిగించడంతో గతంలో క్వాలిఫై అయ్యి, తాజాగా క్వాలిఫై కాలేకపోయినవారికి మాత్రం ఉపశమనంగా చెప్పవచ్చు.
టెట్లో కౌటాల అమ్మాయికి 126 మార్కులు..
కౌటాల, జూలై 1 : టెట్ ఫలితాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన ధరుణుడే మనీషా 126 మార్కులు సాధించింది. ఈమెకు గత ఏడాది డిసెంబర్లో బీపీఎంగా ఉద్యోగం వచ్చింది. టీచర్ కావాలనే పట్టుదలతో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఉచిత టీఆర్టీ/టెట్ కోచింగ్ తీసుకొన్నది. టెట్లో 126 మార్కులు సాధించిన ఆమె ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులకు కృతజ్ఞతలు తెలిపింది.